బ్రిటన్‌లో ‘బ్రెగ్జిట్‌’ చిచ్చు

10 Jul, 2018 01:57 IST|Sakshi
థెరీసామే

ఇద్దరు మంత్రుల రాజీనామా

ప్రధాని థెరీసా మేపై పెరుగుతున్న ఒత్తిడి  

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని థెరీసామే చిక్కుల్లో పడ్డారు. సోమవారం ఇద్దరు సీనియర్‌ మంత్రులు రాజీనామా చేయడంతో.. బ్రిటన్‌ రాజకీయం వేడెక్కింది. బ్రెగ్జిట్‌ విషయంలో మే అనుసరిస్తున్న వ్యూహాలతో విభేదిస్తూ బ్రెగ్జిట్‌ మంత్రి  డేవిడ్‌ డేవిస్‌ రాజీనామా చేయగా.. కాసేపటికే విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ భేటీలో బ్రెగ్జిట్‌ అనంతరం యురోపియన్‌ యూనియన్‌ దేశాలతో అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాలు తీసుకున్న మూడ్రోజుల్లోపే ఇద్దరు సీనియర్‌ మంత్రులు రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనికితోడు వీరిద్దరూ బ్రెగ్జిట్‌ విధానపర నిర్ణయాలనే కారణంగా చూపుతూ రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. థెరీసా మే రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. థెరీసా మే కేబినెట్లో బోరిస్‌కు బ్రెగ్జిట్‌ అనుకూల మంత్రుల పోస్టర్‌బాయ్‌గా పేరుంది.  

తిరుగుబాటు యోచన లేదు
ప్రధాని థెరీసా మేతో విధానపరమైన అంశాల్లో విభేదాల కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్‌ ప్రకటించారు. ఈయూతో బ్రిటన్‌ ప్రభుత్వ చర్చల ప్రక్రియలో తనను సంప్రదించడంలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్‌ వెల్లడించారు. అయితే, మేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తే ఆలోచన లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు