ప్లస్ సైజ్ బ్లాగర్ కు ఇన్ స్టాగ్రామ్ సారీ!

10 Jun, 2016 19:07 IST|Sakshi
ప్లస్ సైజ్ బ్లాగర్ కు ఇన్ స్టాగ్రామ్ సారీ!

ప్లస్ సైజ్ ఉన్నవారి ఫోటోలను డిలీట్ చేసిన ఇన్ స్టాగ్రామ్.. అనంతరం బ్లాగర్లకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  సింగపూరియన్ ఇండియన్ బ్లాగర్ ఆర్తీ ఒలీవియా దుబే.. తాను బికినీతో ఉన్న ఫోటోలను పోస్టు చేయగా కొద్దికాలం క్రితం ఇన్ స్టాగ్రామ్ నుంచి వాటిని తొలగించారు. దీంతో ఆమె వారంపాటు ఆందోళన నిర్వహించడంతో చివరికి దారికొచ్చిన ఇన్ స్టాగ్రామ్... తప్పైపోయిందంటూ ఆమెకు క్షమాపణలు చెప్పడంతోపాటు, అనుకోకుండా ఫోటోలు డిలీట్ అయినట్లుగా వివరణ కూడ ఇచ్చింది.

తన బ్లాగ్ లో 'పెంఛంట్ ఫర్ ఫ్యాషన్, ఫాట్ బ్రౌన్ ఫెమినిస్ట్' అంటూ  తనకు తాను నిర్వచించుకునే బ్లాగర్ ఒలీవియా దుబే... తనతోపాటు మరో ఇద్దరు ప్లస్ సైజ్ బ్లాగర్ల బికినీ షూట్ ఫోటోలను మే 21న సైట్ నుంచి తొలగించడంతో ఆందోళన ప్రారంభించింది. తన బికిని ఫోటోలను సైట్ నుంచి తొలగించి తనను అవమానించినందుకు గాను తనకు ఇన్ స్టాగ్రామ్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలంటూ  జూన్ 1న తన అకౌంట్ లో ఓ నోట్ పెట్టి డిమాండ్ ప్రారంభించింది. అయితే దుబే డిమాండ్ కు దిగొచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఆమె ఫోటోలను తొలగించినందుకు క్షమాపణలు చెప్పింది.


కాగా ఇన్ స్టాగ్రామ్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని, తాను క్షమాపణలను అంగీకరించినా తదుపరి ప్రయోజనం ఉండదని, అందుకే  తిరిగి తన ఫోటోలను పోస్ట్ చేయడంతోపాటు,  తొలగించిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలోని ప్లస్ సైజ్ ఫ్రెండ్స్ అందరి ఫోటోలను పోస్ట్ చేసి,  అకౌంట్లను తిరిగి ప్రారంభించాలంటూ దుబే పట్టుబడుతోంది.

మరిన్ని వార్తలు