ఈ ఏడాది మ్యాన్ బుకర్ ప్రైజ్ కోసం భారత అమెరికన్ రచయిత జంపా లహరి కూడా పోటీ పడుతున్నారు. కాల్పనిక సాహిత్యానికిచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం జంపా రాసిన ‘ద లోల్యాండ్’తోపాటు మొత్తం 13 నవలలను జడ్జీల బృందం ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద 50 వేల పౌండ్ల నగదు బహుమతి లభిస్తుంది. ‘ద లోల్యాండ్’ నవలను ఈ సెప్టెంబర్లో ముద్రించనున్నారు. ఈసారి పురస్కారానికి పోటీపడుతున్న రచయితల్లో ఎక్కువ మంది పెద్దగా పేరుప్రఖ్యాతులు లేనివారే . ఈ నేపథ్యంలో జంపా నవలకు బుకర్ ప్రైజు వచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 1967లో లండన్లో జన్మించిన జంపా లహరి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆమె తల్లిదండ్రులు పశ్చిమబెంగాల్కు చెందిన వారు. జంపా రచన ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలడీస్’కు 2000లో పులిట్జర్ పురస్కారం దక్కింది. మరో రచన ‘ద నేమ్సేక్’ సినిమాగా వచ్చింది.