‘గాంధీ మస్ట్‌ ఫాల్‌’ గ్రూపు సభ్యుల విజయం

1 Nov, 2018 08:53 IST|Sakshi

లిలాంగ్వే, మలావి : తూర్పు ఆఫ్రికా దేశమైన మలావి వాణిజ్య రాజధాని కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. గాంధీజీ.. తన జీవితంలో ఎక్కువ కాలం జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికే వెచ్చించారని, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాజధానిలో నిర్మించడం సబబు కాదని..‘ గాంధీ మస్ట్‌ ఫాల్‌​’ గ్రూప్‌ సభ్యులు కోర్టుకు విన్నవించారు.

అంతేకాకుండా.. ‘నల్లజాతీయులైన తమకు గాంధీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు సరికదా, ఆ భావన మాలో మరింత బలంగా నాటుకుపోయింది’ అంటూ మరో పద్దెనిమిది అభ్యంతరాలతో కూడిన లేఖను కోర్టుకు అందజేశారు. సుమారు 3 వేల మంది మలావియన్స్‌ సంతకం చేసిన ఈ లేఖను, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఆఫ్రికా దేశాల్లో గాంధీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. 2016లో ఘనాలోని ఓ యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఘనా ప్రభుత్వం ప్రయత్నించగా.. గాంధీజీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరో చోట విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించింది. శాంతి, అహింసా మార్గాలతో భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసేందుకు తన జీవితాన్ని ధారపోసిన గాంధీజీ.. తొలి ఉద్యమం దక్షిణాఫ్రికాలో మొదలైందన్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశాల్లోని కొంతమంది ప్రజలు మాత్రం ఆయనను ఓ జాత్యహంకారిగా, తమ మధ్య విభేదాలు సృష్టించిన వ్యక్తిగా ద్వేషిస్తూ ఉంటారు.

మరిన్ని వార్తలు