నల్ల కుబేరులకు ‘స్విస్‌’ నోటీసులు

27 May, 2019 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ/బెర్న్‌: స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో నల్లధనం దాచుకున్న వారికి స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతున్నాయి. తాజాగా 11 మంది భారతీయులకు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాఖీదులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనున్నామని, దీనిపై అభ్యంతరాలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించింది. అప్పీల్‌ చేసుకోవడానికి ఇదే ఆఖరు అవకాశమని స్పష్టం చేసింది. వీరిలో కృష్ణ భగవాన్‌ రామ్‌చంద్, కల్పేష్‌ హర్షద్‌ కినారివాలా మొదలైన వారి పేర్లు ఉన్నాయి. మిగతా వారి పేర్లను కేవలం పొడి అక్షరాలతో మాత్రమే స్విస్‌ ప్రభుత్వం తన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది. దశాబ్దాలుగా నల్ల కుబేరులకు స్విస్‌ బ్యాంకులు ఊతంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఈ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి స్విస్‌ బ్యాంకుల భారతీయ క్లయింట్స్‌కు 25 నోటీసులు దాకా జారీ అయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు