ఈతకు వెళ్లి.. ఎన్నారై విద్యార్థి మృతి

15 Dec, 2016 12:46 IST|Sakshi
ఈతకు వెళ్లి.. ఎన్నారై విద్యార్థి మృతి
స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. విశాఖపట్నానికి చెందిన అనుదీప్ ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాలోని  మెల్‌బోర్న్ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఈ సంవత్సరం మార్చిలో ఆస్ట్రేలియా వెళ్లాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి మెల్‌బోర్న్‌లోని ఒక చెరువులో ఈతకు వెళ్లాడు. అయితే.. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటోంది. 
 
ఆ విషయం గుర్తించలేని అనుదీప్.. అలాగే చెరువులో ఈతకు దిగాడు. దాంతో అక్కడున్న మంచుగడ్డల్లో ఇరుక్కుపోయి మరణించాడు. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులకు గురువారం తెల్లవారుజామున చెప్పారు. అతడి తండ్రి నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు హతాశులయ్యారు.