ఉత్తర కొరియాపై ఇక నాకు ఓపిక లేదు: ట్రంప్‌

1 Jul, 2017 08:43 IST|Sakshi
ఉత్తర కొరియాపై ఇక నాకు ఓపిక లేదు: ట్రంప్‌
న్యూయార్క్: ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గుర్రుమన్నారు. ఆ దేశంపై తమకు ఇక ఓపిక పోయిందని, ఇక ఏ మాత్రం సహనంతో వ్యవహరించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉత్తర కొరియా చేస్తున్న అతి మీదే ఎక్కువగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మూన్‌తో మాట్లాడిన ట్రంప్‌ 'ఉత్తర కొరియా విషయంలో ఇప్పటి వరకు మాకున్న వ్యూహాత్మక సహనం విఫలమైంది.

ఎన్నో ఏళ్లుగా విఫలమవుతూ వస్తోంది. మొహమాటం లేకుండా చెప్పాలంటే.. ఇక మా సహనం ముగిసింది' అని అన్నారు. అమెరికా పలు హెచ్చరికలు చేస్తున్నా లెక్కలేనితనంతో అణు కార్యక్రమాన్ని ఉత్తర కొరియా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా దక్షిణ కొరియా, అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక అమెరికా అయితే ఉత్తర కొరియాను నేరుగా విమర్శించింది కూడా. ఈ నేపథ్యంలో ఇక చివరిసారి ఉత్తర కొరియాపై ఏం చేద్దాం అనే దిశగా ట్రంప్‌, మూన్‌ జే ఇన్‌ మధ్య శ్వేతసౌదంలో ప్రత్యేక సమావేశం జరిగింది.
మరిన్ని వార్తలు