రోబోలకూ హ్యాకింగ్‌ ముప్పు

30 Jul, 2018 01:54 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇంటర్నెట్‌ వాడుతున్న మనుషులకే కాదు రోబోలకు కూడా హ్యాకింగ్‌ ముప్పు ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. పరిశోధనలు చేసే రోబోల కదలికలను హ్యాకర్లు రిమోట్‌ ద్వారా నియంత్రించే ప్రమా దం ఉందని, ఆఖరికి రోబోల కెమెరా లోని సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రోబో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఆర్‌వోఎస్‌)ను ప్రపంచవ్యాప్తంగా స్కాన్‌ చేశారు. 2017–18 మధ్య చేసిన ఈ స్కానింగ్‌లో దాదాపు 100 వరకు సురక్షితం కాని వ్యవస్థలు ఆర్‌వోఎస్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించారు.

‘కొన్ని సురక్షితం కాని రోబోలకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ పరిశోధనలు చేసే రోబోలు మాత్రం పబ్లిక్‌ ఇంటర్నెట్‌ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నియంత్రించవచ్చు’ అని పరిశోధకులు వివరించారు. రోబోలకు, వాటిని నడిపే మనుషులకూ ప్రమాదంగా పరిణమించేలా వాటిని ప్రభావితం చేయొచ్చన్నారు. డిజిటల్‌ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం గుర్తు చేస్తోందన్నారు. ఆర్‌వోఎస్‌ను హ్యాక్‌ చేయ డం ద్వారా రోబోల కెమెరాలు, సెన్సర్లు తదితర పరికరాలనూ నియత్రించొచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు