గ్రామీణ పబ్బులకు దారేది?

11 Feb, 2016 18:45 IST|Sakshi
గ్రామీణ పబ్బులకు దారేది?

లండన్: మద్యం మత్తులో వాహనాలను నడిపే మందు బాబుల్లో మార్పు తీసుకు రావాలని ఇంగ్లండ్ ప్రభుత్వం భావించింది. వాహనాల డ్రైవర్లు 100 ఎంఎల్‌కు 80 ఎంజికిలోపు మద్యం సేవించవచ్చన్నది ప్రస్తుతం ఇక్కడ అమల్లో ఉన్న విధానం. ఈ పరిమితిని 80 నుంచి 50కి తగ్గంచాలని భావించింది. ఈ మేరకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. ఇది తెలిసి మద్యం పరిశ్రమ కన్నెర్ర చేసింది. మద్యం సేవించి వాహనాలను నడిపే పరిమితిని తగ్గించినట్లయితే గ్రామీణ పబ్బులన్నింటిని మూసివేస్తానని హెచ్చరించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పబ్బులపై ఆధారపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఈ హెచ్చరికతో ఇంగ్లండ్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్కాట్‌లాండ్‌లో గత డిసెంబర్ నెలలో మద్యం పరమితిని 80 నుంచి యాభైకి తగ్గించింది. పర్యవసానంగా అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు పది శాతం పడిపోయాయి. రోడ్డు ప్రమాదాలు కూడా 12.5 శాతం తగ్గాయని, గత ఏడాది 25 మందికి ప్రాణాపాయం తప్పిందని, 95 మంది గాయాల ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ఓ సర్వే వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్, వేల్స్‌లో స్కాట్‌లాండ్‌లాగా మద్యం పరిమితిని తగ్గించాలని ఇంగ్లండ్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయం పార్లమెంట్‌లో కూడా చర్చకు వచ్చినప్పుడు, మద్యం పరిమితిని తగ్గించడం వల్ల వచ్చే లాభనష్టాలను బేరేజు వేయడానికి స్కాట్‌లాండ్ మంత్రితో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ రవాణా మంత్రి తెలిపారు.

 

అధిక పన్నుల వల్ల ఇప్పటికే సతమతమవుతున్నామని, మద్యం పరిమితిని తగ్గిస్తే గ్రామీణ పబ్బులను మూసివేయడం మినహా తమకు మరోమార్గం లేదని బ్రిటిస్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రిగిడ్ సైమండ్స్ ప్రకటించారు. ఇంగ్లండ్‌లో సురక్షితమైన రోడ్లు ఉన్నాయని, ప్రస్తుత పరిమితి మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరగవని, కాకపోతే ఆ మోతాదుకు మించి తాగకుండా ప్రజల్లో ప్రభుత్వమే చైతన్యం తీసుకరావాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు