తల్లివని నిరూపించుకో...

30 May, 2018 18:33 IST|Sakshi
లిండ్సే గోట్లీబ్

న్యూయార్క్‌ : అప్పుడప్పుడు ఎయిర్‌ పోర్టు అధికారులు కాస్తా విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమ తెలివి తక్కువ పనులతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి...ఆనక క్షమించమని కోరతారు. సరిగా ఇలాంటి పనే చేశారు సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్‌ అధికారులు. ఓ ప్రయాణికురాలితో పాటు ప్రయాణిస్తున్న ఆమె సంవత్సరం కొడుకుకు తానే కన్నతల్లని నిరూపించుకోవాలని కోరారు. పాస్‌పోర్టు చూపించనా నమ్మని వాళ్లు చివరకూ ఫేస్‌బుక్‌ పోస్టు చూసి సమాధాన పడ్డారు. ఇందుకు సంబంధించిన విషయాలను సదరు ప్రయాణికురాలు తన ట్విటర్‌లో పోస్టు చేసింది.

వివరాల ప్రకారం.. బెర్కిలీస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మహిళా బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా పనిచేస్తున్న లిండ్సే గోట్లీబ్ తన ఏడాది వయసున్న కొడుకుతో కలిసి ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా సౌత్‌వెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు అధికారులు లిండ్సే పాస్‌ పోర్టుతో పాటు, ఆమె కొడుకు పాస్‌పోర్టును కూడా తనిఖీ చేశారు. అన్ని సరిగానే ఉన్నప్పటికి కూడా లిండ్సేనే ఆమెతో పాటు ఉన్న బాబుకు కన్నతల్లని నిరూపించుకోవాల్సిందిగా కోరారు. చివరకూ ఆమె ఫేస్‌బుక్‌ పోస్టు చూసిన తర్వాతే ఆమెను ప్రయాణించడానికి అనుమతించారని లిండ్సే తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

అంతేకాక ఈ విషయం గురించి లిండ్సే ‘నా కొడుకు వయసు, గుర్తింపుకు సంబంధించి అన్ని విషయాలు పాస్‌పోర్టులో ఉన్నాయి. పైగా ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరమూ అక్కడే ఉన్నాం. అయినా అధికారులు నేనే నా బిడ్డకు కన్నతల్లినని నిరూపించుకోమని కోరారు. ఒక తల్లికి ఇది ఎంత బాధకరమైన విషయమో వారికి తెలియదనుకుంటా. బహుశా నా కొడుకు శరీర రంగు, నా రంగుకు భిన్నంగా ఉండటం వల్ల వారు ఇలా అడిగి ఉంటారు’ అని అన్నారు.

ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఎయిర్‌పోర్టు అధికారులను విమర్శించడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. కేవలం తనఖీల్లో భాగంగానే తమ సిబ్బంది అలా ప్రశ్నించారే తప్ప ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని చెప్పారు. మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించినందుకు క్షమించమని లిండ్సేను కోరారు. అందుకు లిండ్సే ‘ఇక మీదట ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలనే అంశం గురించి మీ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ ఇస్తే మంచిద’ని చురకంటిచారు.

మరిన్ని వార్తలు