‘180 మందిని సముద్రంలోకి తోసేశారు’

11 Aug, 2017 00:59 IST|Sakshi
‘180 మందిని సముద్రంలోకి తోసేశారు’

దుబాయ్‌: యెమెన్‌ సమీపంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో స్మగ్లర్లు అక్రమంగా యెమెన్‌కు తరలిస్తున్న 180 మంది ఆఫ్రికన్లను సముద్రంలోకి తోసేయడంతో ఆరుగురు మృతి చెందగా..దాదాపు 50 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గాయాలతో యెమెన్‌ దక్షిణ తీరానికి చేరుకున్న 25 మంది శరణార్థులకు చికిత్స అందిస్తున్నట్లు ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ(ఐఓఎం) తెలిపింది.

శరణార్థుల్లో ఇథియోపియోకు చెందిన యువతీయువకులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం కూడా మనుషులను అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్లు యెమెన్‌ తీరం సమీపంలో సోమాలియా,ఇథియోపియాకు చెందిన 120 మంది శరణార్థులను సముద్రంలోకి తోసేయడంతో 50 మంది మృతి చెందగా, 22 మంది గల్లంతయ్యారని ఐఓఎం పేర్కొంది. తీరానికి కొట్టుకువచ్చిన 29 మృతదేహాలను మిగిలిన శరణార్థులు పూడ్చిపెట్టారని వెల్లడించింది.

మరిన్ని వార్తలు