ఫ్యూజ్‌ మారుస్తుండగా ప్రాణాలే పోయాయ్‌

12 Jan, 2018 20:22 IST|Sakshi

సాక్షి, ములుగు రూరల్‌: ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫ్యూజ్‌ మార్చుతూ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లి  గ్రామంలో శుక్రవారం జరిగింది. మల్లంపల్లికి చెందిన మోత్కూరి సుధాకర్‌(43) తన వ్యవసాయ భూమిలో అరటి తోట సాగు నిమిత్తం చేను తడిపేందుకు శుక్రవారం నీరు పారిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫ్యూజ్‌ కొట్టేయడంతో మోటార్‌ ఆగిపోయింది. దీంతో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి ఫ్యూజ్‌ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు