ఆమె గుర్తుకొచ్చింది

13 Jul, 2019 02:23 IST|Sakshi
రాంబాబు, భరద్వాజ, రత్నకుమార్, నందిని, అమలాపాల్, శ్రీకాంత్, విజయ్‌ ప్రశాంత్‌

‘‘ఈ సినిమా పోస్టర్‌ విడుదల చేస్తుంటే నాకు 25 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తోంది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం ‘ఆమె’. చరితచిత్ర బ్యానర్‌ ద్వారా నేను హీరో అయ్యాను. ఆ బ్యానర్‌లో యాక్టివ్‌గా సినిమాలు చేయమని తమ్మారెడ్డిగారికి చాలా సార్లు చెప్పాను. వైవిధ్యమైన చిత్రం ‘ఆమె’తో ఆయన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్‌. అమలాపాల్‌ లీడ్‌ రోల్‌లో రత్నకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆమె’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం పోస్టర్‌ను శ్రీకాంత్‌ విడుదల చేశారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘1979లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకొచ్చిన 40 ఏళ్లలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ అమలాపాల్‌ ‘ఆమె’ చూసి షాక్‌ అయ్యాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్యాషన్‌ ఉండాలి. అమలాపాల్‌ నటన చూసి షాకయ్యాను. ఈ జనరేషన్‌లో ఇంత గొప్పగా నటించిన వాళ్లు లేరు. ఈ సినిమా చేస్తున్నందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘హీరోయిన్లు కూడా కంటెంట్లను నమ్మి సినిమాలు చేస్తున్నారు. సమంత, అమలాపాల్, నయనతార, అనుష్క వంటివారందరూ ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్‌ నందినీరెడ్డి.

‘‘మా సినిమాని ఓ సెన్సార్‌ బోర్డు సభ్యురాలు మెచ్చుకున్నారు. అంత సెన్సిబుల్‌ సెన్సార్‌ బోర్డు మన దగ్గర ఉన్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రత్నకుమార్‌. ‘‘నేను నగ్నంగా నటించిన సన్నివేశంలో నగ్నత్వం కన్నా, నీ కళ్లలో ఎక్కువ బాధ కనిపించింది’’ అని అనురాగ్‌ కశ్యప్‌గారు చెప్పిన మాటలను మర్చిపోలేను’’ అని అమలాపాల్‌ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: రాంబాబు కల్లూరి, విజయ్‌ మోరవెనేని, సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్‌.

మరిన్ని వార్తలు