పదమూడేళ్ల తరువాత!

16 Nov, 2016 22:23 IST|Sakshi
పదమూడేళ్ల తరువాత!

‘నా పేరు శివమణి. నాక్కొంచెం మెంటల్’ - థియేటర్‌లో నాగార్జున ఈ డైలాగ్ కొడుతుంటే.. ‘‘ఖాకీ చొక్కాలో మన మన్మథుడు చితకొట్టేశాడు... అంతే!’’ అంటూ అభిమానులు ఈలలేశారు. నాగ్‌లోని మాస్ యాంగిల్‌ని ‘శివమణి’లో దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్తగా చూపించారు. పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ఖాకీ డ్రెస్‌లో ఆయన కనిపించనున్నారు. నాగ్ కోసం ‘ప్రేమమ్’ ఫేమ్, ఆయన వీరాభిమాని దర్శకుడు చందు మొండేటి  ఓ స్టోరీ లైన్ రెడీ చేసి, ఎప్పుడో వినిపించారు. ఈ వారంలో పూర్తి స్థాయి కథ వినిపించబోతున్నారట. ‘‘సమకాలీన అంశంతో సాగే పోలీసాఫీసర్ కథ ఇది. నాగ్ క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది’’ అని దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయమైన చందు ఆ తర్వాత నాగార్జునతో సినిమా చేయాలనుకున్నారు. కానీ, నాగచైతన్యతో ‘ప్రేమమ్’ సెట్ అయింది. ఆ సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్, రవితేజ లకూ చందు స్టోరీ లైన్స్ చెప్పారు. వాళ్లకూ ఆ యా కథలు నచ్చాయి. అయితే, నాగ్‌తో సినిమా ముందు సెట్స్‌కి వెళ్తుందని సమాచారం. ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత ఇటు ఓంకార్‌తో చేసే ‘రాజు గారి గది-2’, అటు చందు పోలీసాఫీసర్ సినిమా - రెండింటితో నాగ్ బిజీ అన్న మాట.