న్యాయాన్ని గెలిపిస్తారు

24 Dec, 2018 03:11 IST|Sakshi

ముగ్గురు ఆకతాయిల వల్ల లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిలు న్యాయం కోసం పోరాడతారు. వీరికి ఓ లాయర్‌ అండగా నిలబడతాడు. న్యాయం గెలిచేట్టుగా కలసి పోరాడతారు. ఈ కథాంశంతో బాలీవుడ్‌లో రూపొందిన చిత్రం ‘పింక్‌’. అమితాబ్‌ బచ్చన్‌ లాయర్‌ పాత్ర పోషించారు. లైంగిక వేధింపుల బాధితురాలుగా తాప్సీ నటించారు. ‘పింక్‌’ చిత్రం సూపర్‌ హిట్‌. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత బోనీ కపూర్‌. అమితాబ్‌ పోషించిన పాత్రను అజిత్‌ చేయనున్నారు.

ఇందులో ముగ్గురు అమ్మాయిల్లో మలయాళ నటి నజ్రియా నజీమ్, ‘హలో’ ఫేమ్‌ కల్యాణీ ప్రియదర్శన్, కన్నడ భామ శ్రద్ధా శ్రీనాద్‌ నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. నటుడు ఫాహద్‌ ఫాజిల్‌తో వివాహం అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు నజ్రియా. ఈ చిత్రంతో మళ్లీ తమిళ సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు. అలాగే కల్యాణీ ప్రియదర్శన్‌ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తాప్సీ పాత్రను ఎవరు పోషిస్తారనే సంగతి తెలియాలి. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రాన్ని ‘ఖాకీ’ ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ డైరెక్టర్‌. మే 1 అజిత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.

మరిన్ని వార్తలు