'శృతిహాసన్‌ను వేధించేందుకే పిటిషన్లు'

17 Apr, 2015 19:25 IST|Sakshi
'శృతిహాసన్‌ను వేధించేందుకే పిటిషన్లు'

హైదరాబాద్: సినీ కథనాయిక శృతి హాసన్‌ను వేధించడంలో భాగంగానే పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ సంస్థ వాస్తవాలను దాచి పిటిషన్లు దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆమె తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. శృతీహాసన్‌పై పిక్చర్ హౌస్ మీడియా దాఖలు చేసిన పిటిషన్‌ను 25వ అదనపు చీఫ్ జడ్జి సాంబశివరావునాయుడు శుక్రవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా శృతీహాసన్ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. వాస్తవానికి శృతీహాసన్ స్థానంలో తమన్నాతో ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్‌లోనే సినిమా షూటింగ్ నిర్వహిస్తూ... మరోవైపు తమ సినిమా పూర్తయ్యే వరకూ శృతీహాసన్ మరో సినిమాలో నటించకుండా ఈ కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు పొందారని నివేదించారు.


గత నెల 25న ఈ కోర్టును ఆశ్రయించక ముందే తమన్నాతో వారు ఒప్పందం చేసుకున్నారని... ఈ విషయాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం శృతీహాసన్‌కు పిక్చర్ హౌస్ మీడియా రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాలని, కాల్‌షీట్ల కోసం నెల రోజుల ముందే సంప్రదించాల్సి ఉందని తెలిపారు. అయితే, అడ్వాన్స్ చెల్లించకపోగా, ఏప్రిల్ 2 నుంచి షూటింగ్‌కు రావాలంటూ కొన్ని రోజుల ముందే కోరినట్టు వివరించారు. శృతీహాసన్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇదే విషయాన్ని మీడియా హౌస్ ప్రతినిధులకు తెలిపిందన్నారు.


నిబంధనలు పాటించకపోవడంతో వీరి మధ్య జరిగిన ఒప్పందమే చెల్లదని తెలిపారు. శృతీహాసన్ కొత్త సినిమాలతో ఒప్పందం చేసుకోరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని కోరారు. ఈ వ్యవహారంపై తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని పిక్చర్ హౌస్ మీడియా తరఫు న్యాయవాది కోరవడంతో విచారణను కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిలు కథానాయకులుగా, శృతీహాసన్ కథానాయికగా నటించేందుకు పిక్చర్ మీడియా హౌస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.