అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందీ సినిమా - నాగార్జున

25 Oct, 2013 01:29 IST|Sakshi
అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందీ సినిమా - నాగార్జున
‘‘హాస్పటల్ నుంచి నాన్నగారు ‘వాట్సప్’ ద్వారా ‘ఆల్ ది బెస్ట్ భాయ్ టీమ్’ అని మెసేజ్ పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వీరభద్రమ్ దర్శకత్వంలో నాగార్జున నటించి, నిర్మించిన చిత్రం ‘భాయ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -‘‘అహనా పెళ్లంట, పూలరంగడు సినిమాల్లో వీరభద్రమ్ కామెడీ టైమింగ్ నచ్చి ఈ కథ విన్నాను. వండర్ అనిపించింది. కేవలం స్క్రిప్ట్‌కే అయిదారు నెలలు పనిచేశాం. అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందీ సినిమా. వీరభద్రం మంచి పంచ్ డైలాగులు రాయించాడు.
 
 దేవిశ్రీతో ఇది నా అయిదో కాంబినేషన్. నా ప్రతి సినిమాకూ డిఫరెంట్ పాటలిచ్చాడు. ఈ జన్మకి దేవిశ్రీకు రుణపడి ఉంటాను. గీతరచయితలందరూ మంచి సాహిత్యం ఇచ్చారు. స్టార్స్ అని మమ్మల్ని అంటారు కానీ... నిజానికి  తెరవెనుక ఉన్నవాళ్లే నిజమైన స్టార్స్. రిలయన్స్ సంస్థతో టై ఆప్ కావడంతో క్రమశిక్షణ అంటే ఏంటో తెలిసింది. ఇలాంటి కార్పొరేట్ సంస్థలు సినీ నిర్మాణంలో పాలు పంచుకుంటే... పరిశ్రమకు క్రమశిక్షణ తెలుస్తుంది. ఇప్పుడు నాకూ వరుసగా సినిమాలు నిర్మించాలని ఉంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో మళ్లీ కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలో నాకు పెద్ద బ్రేక్‌ని ఇచ్చిన సినిమా ‘మన్మథుడు’. అప్పట్నుంచి మా కలయిక సూపర్‌హిట్టే. వీరభధ్రమ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కొన్ని పంచ్ డైలాగులు కూడా చెప్పాడు.
 
 వాటిని బట్టే ‘బీహెచ్‌ఏఐ భాయ్’ టైటిల్ సాంగ్  చేసి వెంటనే వినిపించా. ఓ హీరో వేరే హీరో సక్సెస్ గురించి మాట్లాడటం అరుదు. కానీ నాగ్ అందుకు అతీతుడు. రీసెంట్‌గా జరిగిన ‘భాయ్’ వేడుకలో ‘అత్తారింటికి దారేది’ గురించి, నా గురించి అభినందనీయంగా మాట్లాడారు. ఇలాంటి మాటలు పరిశ్రమలో మంచి వాతావరణానికి నాంది పలుకుతాయి’’ అని దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. నాగార్జున చేతుల మీదుగా చిత్రం యూనిట్‌కి డిస్క్‌ల ప్రదానం జరిగింది. ఇంకా వీరభద్రమ్, హంసానందిని, జరాషా, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, ఆదిత్య ఉమేష్‌గుప్త, ఫైట్ మాస్టర్ విజయ్, రిలయన్స్ సీఎఫ్‌ఓ శభాషిష్ సర్కార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.