‘ది స్కై ఈజ్ పింక్’ ప్రమోషన్ నుంచి తప్పుకున్న జైరా

2 Jul, 2019 15:04 IST|Sakshi

దంగల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జైరా వసీమ్ ‘ఇక నుంచి తాను సినిమాల్లో నటించబోనని’ ఇటివలే  ‘సోషల్‌’ మాధ్యమంలో ప్రకటించారు. తాను తీసుకొన్న నిర్ణయంలో భాగంగానే  జైరా, తన రాబోయే చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’  ప్రమోషన్లలో భాగం కావడం లేదని పేర్కొంది. ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్‌11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే సినిమా ప్రమోషన్లను ఆగస్టు చివరి నాటికి ముగించాలని చిత్ర బృందం భావిస్తుండగా,  సినిమా ప్రచార కార్యక్రమాల్లో తాను పాల్గోనబోనని జైరా మూవీ మేకర్లను అభ్యర్థించింది. 

జైరా తీసుకున్న నిర్ణయానికి ‘ది స్కై ఈజ్ పింక్’ నిర్మాణ బృందం తమ మద్దతు ప్రకటించారు. తమ చిత్రంలో ‘ఆయేషా చౌదరీ’ పాత్రకు ప్రతిభావంతులైన జైరాను నటిగా పొందడం తమ అదృష్టమని, సినిమా షూటింగ్‌ ఆద్యంతం ఆమె పూర్తి  ప్రొఫెషనల్గా ఉన్నట్లు వారు తెలిపారు. ‘సినిమాల నుంచి తప్పుకుంటానని జైరా తీసుకొన్న నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఆమెకు ఎల్లవేళలా తమ మద్దతు ఉంటుందని‘ నిర్మాణ బృందం పీటీఐకి ఇచ్చిన ఓ  ప్రకటనలో తెలిపారు. జైరా  సినిమాలు మానేయడానికి గల కారణాలను వివరిస్తూ జైరా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటివలే ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసిన విషయం మనకు తెలిసిందే. కాగా, దంగల్ చిత్రంలో ఆమె చేసిన నటనకుగాను ఉత్తమ సహాయ నటిగా ‘జాతీయ చలనచిత్ర  అవార్డు’ కూడా అందుకున్నారు. 

మరిన్ని వార్తలు