సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

2 Aug, 2019 06:02 IST|Sakshi
జి.నితిన్‌

ధృవ కరుణాకర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అశ్వమేథం’. జి.నితిన్‌ దర్శకత్వం వహించారు. ప్రియా నాయర్, వందనాయాదవ్, శుభా మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ‘అశ్వమేథం’ నా తొలి చిత్రం. ఈ సినిమాకు ముందు రెండు మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించాను. ఒకటి విడుదలైంది. దానికి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే జన్మభూమి’ అవార్డు వచ్చింది. మరో సినిమా ఈ ఆగస్టులో విడుదల కానుంది. నాకు హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలు వచ్చు. ఈ సినిమా నిర్మాత ద్వారా తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేసే అవకాశం వచ్చింది. నాకు తెలుగు భాష రాదు. మాట్లాడగలను.

ఇక ‘అశ్వమేథం’ చిత్రం విషయానికి వస్తే.. డిజిటల్‌ ఎకానమీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సైబర్‌ క్రైమ్‌ అంశాలను ప్రస్తావించాం. హీరో ధృవ చాలా కష్టపడ్డాడు. డూప్‌ లేకుండా చేశాడు. రెండు చేజ్‌ సీక్వెన్స్‌లను కలుపుకుని సినిమాలో మొత్తం ఎనిమిది యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. చిత్రీకరణలో భాగంగా ధృవ దాదాపు 14సార్లు గాయపడ్డారు. అందుకే సినిమా కాస్త ఆలస్యమైంది.’’ అని అన్నారు ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం బాలీవుడ్‌పై సౌత్‌ సినిమాల ప్రభావం బాగా ఉంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోల సినిమాలను మొబైల్స్‌లో ఎక్కువగా చూస్తున్నారు. సౌత్‌కు చెందిన సినిమాలు బాలీవుడ్‌లో మంచి హిట్‌ సాధిస్తున్నాయి. రాజమౌళిగారు తెలుగు సినిమా గొప్పదనాన్ని పెంచారు’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు