సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాం

1 Dec, 2018 00:32 IST|Sakshi
‘దిల్‌’ రాజు, ఎన్వీ ప్రసాద్‌

‘దిల్‌’ రాజు

రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా గత గురువారం (నవంబర్‌ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ఆర్‌. సినిమా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఎన్‌.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.110 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 21.5 కోట్లు వసూలు చేసి, దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. డబ్బింగ్‌ సినిమా చరిత్రలోనే ‘2.ఓ’ సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ చిత్రాన్ని ప్రసాద్‌గారు, మేము, యు.వి.క్రియేషన్స్‌ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఈ చిత్రాన్ని నేను మూడు సార్లు చూశాను.

ఈ మధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు వసూలు చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. శంకర్‌గారు ఈ సినిమాని విజువల్‌గా హాలీవుడ్‌ స్థాయిలో చూపించారు. ఇండియన్‌ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఇంతవరకూ రాలేదు. ‘మహర్షి’ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ‘ఏం తీశారండీ శంకర్‌గారు. చాలా బాగుంది.. గౌతమ్‌ మళ్లీ చూడాలంటున్నాడు’ అని మహేశ్‌బాబుగారు అన్నారు. ఈ మాట వినగానే పిల్లలు ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమైంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు