ముగ్గురి మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం

29 Mar, 2017 15:20 IST|Sakshi
ముగ్గురి మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం

చెన్నై(పెరంబూర్‌): ఇండస్ట్రీకి సంబంధించిన ముగ్గురు ఒకేరోజు కన్నుమూయడంతో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. హాస్యనటుడు సూరి తండ్రి ఆర్. ముత్తుసామి(75) అనారోగ్యంతో కన్ను మూశారు. వెన్నెలా కబడ్డి కుళు చిత్రం ద్వారా హాస్యనటుడిగా పరిచయమైన సూరి ప్రస్తుతం ప్రముఖ హాస్యనటుడిగా రాణిస్తున్నారు. మదురై సమీపంలోని రాజాకూర్‌ గ్రామానికి చెందిన సూరి తండ్రి అనారోగ్యం కారణంగా సోమవారం రాత్రి మృతిచెందారు. ఆయన భౌతిక కాయానికి నటుడు శివకార్తికేయ, పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మంగళవారం స్వగ్రామంలో ముత్తుసామి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్‌ తండ్రి కేవీ.వెంకటేశన్(74) సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీ ప్రముఖుడు, సీనియర్‌ గాయకుడు సీర్కాళి గోవిందరాజన్ భార్య సులోచన(80) శ్వాసకోస సంబంధిత సమస్యలతో సోమవారం రాత్రి స్థానిక అడయార్‌లో కన్నుమూశారు. ఇలా పరిశ్రమకు చెందిన ముగ్గురు ఒకే రోజు మరణించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది.