చరణ్ సినిమా షురూ!

5 Mar, 2015 23:53 IST|Sakshi

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న  రామ్‌చరణ్ మళ్లీ షూటింగ్‌లతో బిజీ అవుతున్నారు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న శ్రీను వైట్ల  కాంబినేషన్‌లో ఓ సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన మహూర్తపు దృశ్యానికి వినాయక్ కెమేరా స్విచాన్ చేయగా, చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు.

సినిమా స్క్రిప్ట్‌ను చిరంజీవి దర్శక -నిర్మాతలకు అందించారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ - ‘‘రామ్‌చరణ్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది.  కొంత గ్యాప్ తర్వాత  మళ్లీ నేను, గోపీమోహన్, కోన వెంకట్  కలిసి మంచి కథ తయారుచేశాం. మా కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలన్నిటి లానే ఈ సినిమా కూడా హిట్టవుతుంది’’ అని చెప్పారు. సినిమా మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటుందని కోన వెంకట్ పేర్కొన్నారు.

నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: అనల్ అరసు, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై ప్రవీణ్ కుమార్.