ఇక కొచ్చి నుంచి కాదు.. హైదరాబాద్‌లోనే

8 Nov, 2019 20:55 IST|Sakshi

క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్ హైదరాబాద్‌లో కొత్త మ్యూజిక్‌ స్టూడియోను ఏర్పాటు చేశాడు. కేరళకు చెందిన గోపీ సుందర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా మారాడు. సాంగ్‌ కంపోజ్‌ కోసం కొచ్చిలోని తన మ్యూజిక్‌ స్టూడియోకు వెళ్లాల్సి వస్తోంది. సమయం వృథాతో పాటు దర్శకనిర్మాతలతో మ్యూజిక్‌ సిట్టింగ్‌, పాటల రికార్డింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన గోపీ సుందర్‌ హైదరాబాద్‌లోనే స్టూడియే ఏర్పాటు చేశాడు. దీంతో ఇక నుంచి చేయబోయే కొత్త చిత్రాల సాంగ్స్‌ను ఇక్కడే కంపోజ్‌ చేయనున్నాడు. 

కాగా ప్రసుత్తం టాలీవుడ్‌లో అగ్ర సంగీత దర్శకులుగా మారినా దేవిశ్రీ ప్రసాద్‌, ఎస్‌ ఎస్‌ థమన్‌లకు కూడా హైదరాబాద్‌లో మ్యూజిక్‌ స్టూడియోలు లేవు. వారు చెన్నైకి వెళ్లి సాంగ్‌ కంపోజ్‌ చేస్తుంటారు. అయితే గోపీ సుందర్‌ హైదరాబాద్‌లో స్టూడియో ఏర్పాటు చేయడం అతడి నిబద్దతకు అద్దం పడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. గత కొద్ది కాలంగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు గోపీ సుందర్‌. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..’ అంటూ సాగే సాంగ్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు మజ్ను, భలేభలే మగోడివోయ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న గోపీ సుందర్‌ ప్రస్తుతం వరల్డ్‌​ ఫేమస్‌ లవర్‌, ఎంత మంచి వాడవురాతో పాటు అఖిల్‌ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు