'శింబు నిజస్వరూపం తెలిసింది'

22 Nov, 2013 06:00 IST|Sakshi
 శింబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశ్రమలోని పలువురు హెచ్చరించినా పట్టించుకోకుండా ప్రేమించానని, ఇప్పుడాయన నిజ స్వరూపం తెలిందని నటి హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. శింబు, హన్సిక ప్రేమించుకుంటున్నారని వెల్లడించగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నటి కుష్బూ, సిమ్రాన్ వంటి సీనియర్ తారామణులు శింబు ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త అంటూ హన్సికను హెచ్చరించారు. అయినా తాము ప్రేమలో పడ్డామని, పెళ్లి కూడా చేసుకుంటామని ఈ జంట ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం వీరి లవ్ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. 
 
 దీనికి కారణం నటి నయనతారనే ప్రచారం వేడెక్కిస్తోంది. నటి నయనతార, శింబు మాజీ ప్రేమికులన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన నయనతారకు ఆ ప్రేమ విషాదాన్నే మిగిల్చింది. ప్రస్తుతం ఒం టరిగా జీవిస్తూ చిత్రాలపై దృష్టి సారిస్తున్న ఈ సంచలన నటి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకను కేరళలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది. ఈ సందర్భంగా ఫోన్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన శింబు తన చిత్రంలో నటిస్తావా అని అడిగారట.
 
  మారుమాట లేకుండా నయనతార ఓకే చెప్పేసిందట. శింబు నిర్మిస్తూ నటిస్తున్నఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విష యం చెవిన పడ్డ హన్సిక దిగ్భ్రాంతి చెందిందట. శింబు నయనతార సరసన నటించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హన్సిక ఆయన్ని ప్రేమించి పెద్ద తప్పు చేశానని బాధపడుతోందట. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం శింబుతో హన్సిక ప్రేమ శకం ముగిసిందని అంటున్నారు.