సాయికృప వల్లే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా

22 Apr, 2015 00:27 IST|Sakshi

 నకిరేకల్ : తాను సాయినాథుని కృపవల్లే మళ్లీ ఆరోగ్యంగా ఉంటూ సీనిమాల్లో నటిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ వెల్లడించారు. నకిరేకల్‌లోని ఐశ్వర్యసాయి మందిరంలో మంగళవారం రెండవ రోజు సాయేదైవం సినిమా షూటింగ్‌లో భాగంగా  రెండవ రోజు పాటలను చిత్రీక రించారు. ఇందులో భాగంగా చంద్రమోహన్‌పై సాయి మందిరంలో పాటను తీశారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. సాయిబాబా చిత్రంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను సాయిబాబా భక్తుడనని పేర్కొన్నారు.
 
 కుటుంబ సమేతంగా నకిరేకల్‌లో సాయినాథున్ని దర్శించుకున్నట్లు చెప్పారు. సినిమాను నిర్మిస్తున్న శ్రీనివాస్‌ను అభినందించారు. 45 ఏళ్లుగా అనేక సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. వీటిలో 50 సినిమాలు తనకు మంచి పేరుతెచ్చాయని గుర్తు చేశారు. సిరిసిరిమువ్వ, రంగులరాట్నం, సీతామహలక్ష్మి, పదహారేళ్లవయస్సు, రాధాకల్యాణం, ఇంటింటిరామయాణం తదితర చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయని వివరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణతో నటించిన లయన్ సినిమా  త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఆయన వెంట సతీమణి జలేంద్ర, సాయి ట్రస్ట్ ప్రతినిధులు యాటా మధుసూదన్‌రెడ్డి, తోనుపూనురి శ్రీనివాస్, నోముల గోవిందరాజులు ఉన్నారు.