బాలీవుడ్లో ఇంతకాలం పరాయిదానిలా అనిపించినా.. ఇప్పుడిప్పుడే ఇక్కడ స్థిరపడుతున్నానని శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటోంది. అంతేకాదు ఆమె చేతిలో ఇప్పుడు రెండు భారీ సినిమాలు కూడా ఉన్నాయి. సుజొయ్ఘోష్ 2009లో తీసిన అలాదీన్ ద్వారా ఈమె బాలీవుడ్కు పరిచయమయింది. ఇతర ప్రాంతాల వాళ్లు హిందీ సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టమేనని ఘోష్ అన్నాడు. ‘నేను శ్రీలంక నుంచి వచ్చిన కొత్త నటిని కాబట్టి ఇక్కడ గుర్తింపు సాధించడానికి కాస్త సమయం పట్టింది.
కష్టపడడం, సహనంతో ఉండడం వల్ల బాలీవుడ్లో స్థిరపడుతున్నాను’ అని జాక్వెలిన్ వివరించింది. సాజిద్ నడియద్వాలా తాజాగా సల్మాన్ఖాన్తో నిర్మిస్తున్న కిక్లో హీరోయిన్గా జాక్వెలిన్కు అవకాశం వచ్చింది. అంతేకాదు దీని షూటింగ్ గురువారం నుంచే మొదలయింది. రణ్బీర్ కపూర్, అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్రలుగా నిర్మితమవుతున్న రాయ్లోనూ ఈ బ్యూటీకి అవకాశం వ చ్చింది. ‘బాలీవుడ్ హేమాహేమీలతో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను సల్మాన్ఖాన్ను ఇంత వరకు కలుసుకోనేలేదు.
రాయ్ షూటింగ్ ప్రకటనల కోసం రణ్బీర్తోపాటు షూటింగ్ చేశాను. రణ్బీర్ మంచి మనిషి’ అని చెప్పింది. జాక్వెలిన్ చేతిలో ఇప్పుడు భారీ చిత్రాలే ఉన్నా.. ఈస్థాయికి చేరుకోవడానికి మాత్రం ఆమె చాలా శ్రమించాల్సి వచ్చింది. మొదట్లో మంచి పాత్రలు రాకపోవడంతో చాలా ఇబ్బందిపడింది. ‘ప్రేక్షకులు, నటులు, దర్శకనిర్మాతలు నన్ను అంగీకరించడం కష్టమన్నారు. పైగా నేను విదేశీయురాలిని.. భాష కూడా రాదన్నారు. వీటిన్నింటినీ నేను సవాల్గా తీసుకున్నాను. ఆ విమర్శలు తప్పని నిరూపించాను’ అని చెప్పిన జాక్వెలిన్ ఇటీవల వచ్చిన 'రామయ్యా.. వస్తావయ్య'లో ఒక ఐటెంసాంగ్కు స్టెప్పులేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్కు కూడా ప్రచారకర్తగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి ర్యాంప్పై సందడి చేసింది.