రంగడే రంగంలోకి దించాడు...

13 Dec, 2014 15:26 IST|Sakshi
రంగడే రంగంలోకి దించాడు...

ఒకప్పటి బాలనటుడు నేడు స్టార్ హీరోలను తయారు చేస్తున్నారు. రంగస్థల నటుడిగా ఆరంగేట్రం చేసి సినీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నటుడిగా, దర్శకునిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఊహ తెలియక ముందే నాటకరంగంలో ప్రవేశించారు. అనూహ్యంగా జరిగిన  ఓ ఘటన ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. సినీరంగంలో తెరవెనక నా అనే వారు లేకపోయినా, ఉన్నత స్థాయికి ఎదిగి ఎందరో స్టార్ హీరోలను తయారు చేస్తున్న లంక సత్యానంద్ టర్నింగ్ పాయింట్ ఈ వారం..
 
 అది విశాఖపట్నంలోని కోటవీధి. రంగస్థల దర్శకుడు వై.ఎస్.రాజు ఇల్లు నాటకాల రిహార్సల్స్‌తో సందడిగా ఉండేది. 1967 జనవరిలో 'నాలుగిళ్ల చావిడి' అనే నాటకానికి పూజా కార్యక్రమం జరుగుతోంది. బాలనటుడు రంగడు పాత్రధారి దానికి గైర్హాజరయ్యాడు. అంతే.. అందరిలోనూ ఆందోళన. ఏం చేద్దాం.. ఆపేద్దామా? అని ఆలోచించారు. ఇంతలో ఇంట్లోని వారు 'ఆపేయడం ఎందుకు? మన బన్నూ ఉన్నాడుగా.. వాడితోనే రంగడు వేషం వేయించొచ్చుకదా!' అన్నారు. ఏరా బన్నూ...రంగడు కేరక్టర్ వేస్తావట్రా! అన్నాడు మేనమామ వై.ఎస్ రాజు. ఓ ఎస్ మావయ్యా అంటూ ఓకే చెప్పాడు బన్నూ. ఆ బన్నూయే సత్యానంద్! అలా ఆ రంగడు ఆబ్సెంట్ అవడంతో రంగస్థలంలోకి అనూహ్యంగా ప్రవేశించాడు ఏడేళ్ల మన ‘రంగడు’.
 
 అదే ఏడాది నవంబర్‌లో 'విధి' నాటకంలో కుర్రాడి పాత్రకు సత్యానంద్‌ను ఎంపిక చేశారు. ఆ నాటకంలో ఉత్తమ ప్రతిభకు మెచ్చి ఎస్వీరంగారావు సత్యానంద్‌కు రూ.116, వెండికప్ ఇచ్చారు. అప్పట్నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు.  40సార్లు ఉత్తమ బాలనటుడి అవార్డులందుకున్నాడు. రంగస్థల దిగ్గజాలు అత్తిలి కృష్ణారావు, చాట్ల శ్రీరాములు, జేవీ రమణమూర్తి, సోమయాజులు వంటి వారి దర్శకత్వాల్లో వచ్చిన నాటకాల్లో 25 సార్లు ఉత్తమ నటునిగా ప్రసంశలందుకున్నారు. నిక్కరు వేసుకునే వయసులోనే ఫుల్‌ఫ్యాంట్ ఎరువు తెచ్చుకుని యుగసంధ్య అనే నాటకానికి దర్శకత్వం వహించారు. కళాజ్యోత్స్న నాటక సంస్థను స్థాపించి 15 నాటకాలు, 60 నాటికలను ప్రదర్శించి 98 సార్లు ఉత్తమ దర్శకునిగా ఖ్యాతి గడించారు.
 
 సినీ ప్రస్థానంలోకి...
 సత్యానంద్ సినీరంగ ప్రవేశమూ అనూహ్యంగానే జరిగింది. ‘మనిషి నూతిలో పడితే’ నాటకం ఆయనను సినిమాల వైపు మళ్లించింది. దర్శకుడు జంధ్యాల ఈ నాటకంలో సత్యానంద్ (అప్పటికి 20 ఏళ్ల వయసు) దర్శక ప్రతిభను చూసి మల్లెపందిరి (1980) సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేయమని ఆహ్వానించారు. మద్రాస్‌లో ఆంధ్ర క్లబ్ నాటకోత్సవాల్లో వంశీతో పరిచయం ఏర్పడింది. తన మంచుపల్లకి సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత శ్రీమతి కావాలి, చైతన్యం, కళ్లు, కలికాలం ఆడది వంటి సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు.
 
 82 మంది స్టార్లకు శిక్షణ....
 మంచుపల్లకి సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి సత్యానంద్‌కు పరిచయమయ్యారు. 1991లో తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు శిక్షణ ఇవ్వాలని చిరు సత్యానంద్‌కు ఫోన్ చేశారు. మెగాస్టార్ తమ్ముడికి నటనలో శిక్షణ ఇవ్వడాన్ని చాలెంజ్‌గా తీసుకుని సక్సెస్ అయ్యారు. 1992లో సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సూచనతో మహేష్‌బాబుకు, ఆ తర్వాత ప్రభాస్, రవితేజ, కల్యాణ్‌రామ్, జయం రవి, బ్రహ్మాజీ తదితరులు ఆయన వద్ద నటనలో శిక్షణ పొందారు. ఇప్పటిదాకా సత్యానంద్ తెలుగు, తమిళ, కన్నడల్లో 82 మంది స్టార్లను తయారు చేశారు. 1994లో ఏయూ థియేటర్ ఆర్ట్స్‌లో సత్యానంద్ ఫ్యాకల్టీగా ఉద్యోగంలో చేరారు.  రెండు పడవలపై ప్రయాణం సరికాదని 2002లో జాబ్‌కు రిజైన్ చేశారు.
 
 స్నేహితుల ప్రోత్సాహం....
 ఉద్యోగం మానేసి యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనుందని తన ఫ్రెండ్, ఆడిటర్ ఈమని భాస్కరరామ్మూర్తికి చెప్పారు. ఆయన మంచి నిర్ణయమన్నాడు. సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ (సాయి) పేరును ఆయన అప్పటికప్పుడే ఖరారు చేశారు. ఈ సంగతిని బాల్యమిత్రుడు అన్నంరెడ్డి కృష్ణకుమార్‌కు చెప్పారు. ఆయన జగదాంబ జంక్షన్లో ఇనిస్టిట్యూట్ కట్టించి ఇచ్చారు.
 
100 మంది హీరోలు లక్ష్యం..

ఇప్పటికి 82 మందికి నటనలో శిక్షణ ఇచ్చి హీరోలుగా తీర్చిదిద్దాను. ఆ సంఖ్యను వందకు చేర్చాలన్నది నా సంకల్పం. సినిమాకు దర్శకత్వం వహించాలని కోరిక ఉంది. నటనలో శిక్షణపై సిలబస్‌ను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఎంతమంది సినీ పెద్దలు ప్రెజర్ పెట్టినా హైదరాబాద్ వెళ్లలేక పోతున్నాను.

ఇంకోమాట...నాటకాల్లోనే మునిగి తేలుతున్నాడు.. కుటుంబానికి ఉపయోగపడడని కుటుంబ సభ్యులు అనేవారు. అమ్మా, నాన్న చనిపోయాక ఐదుగురు తమ్ముళ్లకు, ఏకైక సోదరికి పెళ్లి చేశాను. వాళ్లకు ఇళ్లు కట్టించి ఇచ్చాను. నాకు ఇప్పటికీ సొంతిల్లు లేదు. కేఆర్‌ఎం కాలనీలో అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఫిల్మ్ ఇని స్టిట్యూట్‌కు ప్రభుత్వం స్థలం ఇవ్వాలని కోరుతున్నాను.
 
 మా అబ్బాయి సినిమా విడుదల..
 నా కుమారుడు రాఘవేంద్రరాజ్ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను ఎందరినో సినీ నటులుగా తీర్చిదిద్దుతున్నా తనకు మాత్రం జాబ్‌పైనే ఆసక్తి. కానీ తనలో టాలెంట్‌ను నేను ఎపుడో గుర్తించాను. సమయం వచ్చినప్పుడు సినిమాల్లో పెట్టాలనుకునే వాడిని. మా కుటుంబానికి హాస్యనటుడు ఎంఎస్ నారాయణతో ఎంతో సాన్నిహిత్యం ఉంది.

ఎంఎస్ కుమార్తె శశికిరణ్ నారాయణ 'సాహెబా సుబ్రహ్మణ్యం' అనే మలయాళ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. అనూహ్యంగా అందులో రాఘవేంద్రరాజ్‌కు కామెడీ రోల్ లభించింది. ఆ సినిమా శనివారం రాష్ట్రంలో విడుదలయింది. విశాఖలో తప్ప. ఎందుకంటే రజనీకాంత్ లింగ సినిమా విడుదలవుతున్నందున థియేటర్లు దొరకలేదు. ఇంకా మరో రెండు సినిమాల్లో రాజ్ నటిస్తున్నాడు.