-

నా సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేశారు: కల్యాణ్‌రామ్‌

27 Mar, 2018 00:09 IST|Sakshi
ఉపేంద్ర, కిరణ్‌రెడ్డి, కాజల్, కల్యాణ్‌రామ్, కోన వెంకట్, భరత్‌ చౌదరి, వివేక్‌ కూచిభొట్ల

‘‘నేనెక్కువగా నా సొంత బేనర్‌లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను. బయటి బ్యానర్స్‌లో చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఇప్పుడా సెంటిమెంట్‌ బ్రేక్‌ అయింది. బయటి బ్యానర్స్‌లో నేను చేసిన సినిమాల్లో హిట్‌ అయిన ఫస్ట్‌ మూవీ ‘ఎంఎల్‌ఏ’’ అని కల్యాణ్‌ రామ్‌ అన్నారు. కల్యాణ్‌ రామ్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్‌ఏ’.

టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ఉపేంద్ర మాధవ్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కొన్ని డివైడ్‌ రివ్యూస్‌ రావటంతో నిన్నటి వరకూ (ఆదివారం) నేను కొంచెం డల్‌గా ఉన్నా. గుంటూరు, కృష్ణా జిల్లాల డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌గారు ఆదివారం లేట్‌నైట్‌ ఓ మెసేజ్‌ చేశారు. మన సినిమా తొలిరోజు వసూళ్లను మించి ఆదివారం కలెక్షన్లు ఉన్నాయని చెప్పడంతో సంతృప్తిగా నిద్రపట్టింది. సోమవారం పొద్దున్నే నిర్మాతలకు ఫోన్‌ చేస్తే సినిమాకి మనం పెట్టిన డబ్బులు వచ్చేశాయన్నారు. వెరీ హ్యాపీ’’ అన్నారు.

‘‘కల్యాణ్‌రామ్‌ మంచి లక్షణాలున్న బంగారం. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ని పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది’’ అని భరత్‌ చౌదరి అన్నారు. టి.జి.విశ్వప్రసాద్, కిరణ్‌ రెడ్డి, రచయిత కోన వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు