ఆ షాట్ చూసి... రాజమౌళి ఒళ్లు ఝల్లుమంది!

2 Sep, 2015 22:57 IST|Sakshi
ఆ షాట్ చూసి... రాజమౌళి ఒళ్లు ఝల్లుమంది!

 ‘‘ ‘కంచె’ లాంటి పీరియాడిక్ మూవీ తీయడమంటే చాలా కష్టం. క్రిష్ ఎంతో ప్రేమతో, మనసుపెట్టి ఈ సినిమా తీశారని ట్రైలర్  చూస్తుంటేనే అర్థమవు తోంది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ప్రైమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్న చిత్రం ‘కంచె’.  ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక.
 
 ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ‘‘ట్రైలర్‌లోని యుద్ధ ట్యాంకర్ షాట్ చూడగానే ఒళ్లు ఝల్లుమంది. క్రిష్ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు వస్తాయి. కానీ, ఆయనకు ఇంకా నిజమైన కమర్షియల్ సక్సెస్ రాలేదు. ఈ ‘కంచె’’ సినిమా ఆ కంచె కూడా దాటుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఆ చారిత్రక నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటిదాకా సినిమా రాలేదు.
 
  రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 70 ఏళ్లవుతోంది. ఇప్పుడు దేశాల మధ్య కంచెలు వేసుకుంటున్నారు. మనుషు లకూ, మనసులకూ మధ్య కూడా కంచె వేసుకుంటున్నారు. ఈ అంశంతోనే ఈ సినిమా చే శా’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్, ఆయన తండ్రి నాగబాబు మాట్లా డారు. ఈ చిత్రానికి సంగీతం: చిరంజన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా.