నా జర్నీలో ఇదొక మైలురాయి : కీర్తి

9 Dec, 2019 17:18 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సన్‌ పిక్చర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తలైవార్‌ 168కు శివ దర్శకత్వం వహించనున్నారు. రెండు నెలలుగా ప్రీ ప్రొడక‌్షన్‌ పనుల్లో చిత్రబృందం నిమగ్నమైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు గత కొద్ది రోజులుగా కోలివుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ నటి మీనా నటిస్తున్నారని, రజనీ కూతురుగా కీర్తి సురేశ్‌ నటించనున్నారనేది ఆ వార్తల సారాంశం. అయితే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు కీర్తి సురేశ్‌ తాజాగా ధ్రువీకరించారు. రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని.. తన జీవితంలో ఇది ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం అవుతోందని కీర్తి తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

‘నా జర్నీలో అద్భుతమైన మైలురాయికి సంబంధించిన వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రజనీ సారును కలవడమే గొప్ప అనుభూతి అనుకుంటే.. ఆయనతో కలిసి నటించడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం అవుతోంద’ని కీర్తి పేర్కొన్నారు. కమెడియన్‌ సూరి మాత్రం రజనీతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ చిత్రంలో మిగతా నటీనటుల వివరాలను మాత్రం ప్రకటించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కీర్తి తెలుగులో మిస్‌ ఇండియా, తమిళంలో పెన్‌గ్విన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు రజనీ తాజా చిత్రం దర్బార్‌ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు