నయీమ్‌లానే ఉన్నారు

6 Apr, 2017 23:57 IST|Sakshi
నయీమ్‌లానే ఉన్నారు

కృష్ణంరాజు సతీమణి శ్యామల
గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యూం భాయ్‌’. కట్టా రాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియ, హర్షిత, చలపతిరావు, సుమన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో కట్టా శారద చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను  దర్శకుడు సాగర్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల, గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నాగభూషణం ఆవిష్కరించారు. శ్యామల మాట్లాడుతూ– ‘‘రాంబాబుగారు అచ్చం నయీమ్‌లానే ఉన్నారు. టీజర్‌ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, భరత్‌కి, యూనిట్‌కి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు.

‘‘భరత్‌  మంచి టెక్నీషియన్‌ అయినా రావాల్సినంత పేరు రాలేదు. ‘ఖయ్యూం భాయ్‌’ ఆయనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం యాక్షన్‌ నేపథ్యంలో ఉంటుంది. మే రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ చిత్రం చేశా. క్వాలిటీ, ఖర్చు విషయంలో రాజీ పడలేదు’’ అని కట్టా రాంబాబు చెప్పారు. కట్టా శారద, నటుడు బెనర్జీ, నిర్మాత టి.ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.