‘ఆ మహిళ అసత్య ప్రచారం చేస్తోంది’

6 Feb, 2018 17:16 IST|Sakshi

ఫిర్యాదుపై స్పందించిన అనసూయ

సెల్పీ అడిగితే మొబైల్‌ పగలగొట్టిందని ఓ మహిళ ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌ :  సెల్ఫీ అడిగినందుకు దుర్భాషలాడుతూ.. తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టిందని ఓ మహిళ స్టార్‌ యాంకర్‌, టాలీవుడ్‌ నటి అనసూయ భరద్వాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ట్విటర్‌ వేదికగా అనసూయ స్పందించారు. ఆ మహిళ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ట్వీట్‌ చేశారు.

‘ఈ రోజు ఉదయం తార్నాకలో నివసించే మా అమ్మగారి వద్దకు వెళ్లాను. ఇంటి నుంచి బయటికి రాగానే ఆ మహిళ, అబ్బాయి మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. నా దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగారు. కానీ ఆ సమయంలో సెల్ఫీ దిగేందుకు సిద్దంగా లేకపోవడంతో తిరస్కరించాను. అయినా వారు వినిపించుకోకుండా నన్ను విసిగించారు. నేను నా ముఖాన్ని దాచుకుంటూ  నా కారులో కూర్చున్నా. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఆ మహిళ ఫోన్‌ పగిలిపోయింది. కానీ ఆ మహిళ అసత్య వార్తలను ప్రచారం చేస్తుంది’  అని తెలిపారు. మొబైల్‌ పగిలినందుకు క్షమాపణలు తెలుపుతున్నానని, కానీ నాపై నిందలు వేయడం పద్దతి కాదన్నారు. తనకి కూడా వ్యక్తిగత స్వేచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 సెలబ్రిటీలు కూడా సాటి మనషులేననే విషయం మరిచిపోతున్నామన్నారు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, అది మరిచిపోయి కొంత మంది ఎందుకు ప్రతి విషయాన్ని పెద్దది చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు