రంగస్థలం రీమేక్‌లో లారెన్స్‌?

3 Nov, 2019 08:23 IST|Sakshi

రంగస్థలం చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ సన్నాహాలు చేస్తున్నారా?.. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. తెలుగులో రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. చిత్రంలోని పాటలన్నీ హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా నటి సమంతకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను రాఘవ లారెన్స్‌ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన నటించిన కాంచన–3 మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌ చేస్తానని రాఘవ లారెన్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌ హీరోగా హిందీలో చేసే పనిలో బిజీగా ఉన్నారు. నటి కియారాఅద్వాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీబాంబ్‌ అనే పేరును నిర్ణయించారు.

మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు తెలుగులో హిట్‌ అయిన పటాస్‌ చిత్ర తమిళ రీమేక్‌లో లారెన్స్‌ నటించారన్నది గమనార్హం. మొట్టశివ కెట్టశివ పేరుతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా రంగస్థలం చిత్ర రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారక ప్రకటన ఏదీ లేదన్నది గమనార్హం. ప్రస్తుతం హిందీ చిత్రం లక్ష్మీబాంబ్‌ను పూర్తిచేసే పనిలో లారెన్స్‌ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే రంగస్థలం రీమేక్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.   

మరిన్ని వార్తలు