ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

5 Oct, 2019 02:22 IST|Sakshi
నెహ్రూ విజయ్, రోజా

కలకొండ ఫిలిమ్స్‌ పతాకంపై సి.ఎల్‌. సతీశ్‌ మార్క్‌ దర్శకునిగా కలకొండ నర్సింహా నిర్మాతగా ‘లైఫ్‌స్టైల్‌’ చిత్రం రూపొందింది. నూతన నటీనటులు నెహ్రూ విజయ్, రోజా, నిఖిల్‌లతో  రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా. వకుళాభరణం మోహనకృష్టారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా చక్కని సందేశంతో తీసిన చిత్రం ఇది. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నర్సింహా మాట్లాడుతూ– ‘‘కొన్నేళ్ల క్రితం 2జి నెట్‌వర్క్‌ ఉండేది. అప్పుడు ప్రజలు పద్ధతిగా ఉండేవారు. 4జి నెట్‌వర్క్‌ వచ్చాక మనుషులు మొబైల్‌కి అతుక్కుపోతున్నారు. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చదువులను, ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అన్నారు. ‘‘మొబైల్‌కు అలవాటుపడి యువత చెడు అలవాట్ల బారిన పడుతున్నారు. మొబైల్‌కు నెట్‌వర్క్‌ ఎంత అవసరమో మన ఫ్యామిలీకి మనమూ అంతే అవసరం అని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు  సతీశ్‌.

మరిన్ని వార్తలు