వంశీ చిత్రంలా..!

11 Apr, 2014 02:33 IST|Sakshi
వంశీ చిత్రంలా..!

కౌశిక్‌బాబు, హరీష్, అశ్విని, మిత్ర ముఖ్య తారలుగా వై.ఎల్. భాస్కరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. డి. మోహన్ దీక్షిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ - ‘‘వంశీ, మెహర్ రమేష్‌గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ వంశీగారి చిత్రాల తరహాలో ఉంటుంది’’ అన్నారు.
 
 నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాకి కథే బలం. ఓ అందమైన కవితలాంటి సినిమా ఇది. తూర్చు గోదావరి జిల్లాలోని ఇప్పటివరకు ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాల్లో చేశాం. మరో ఆరు రోజులు జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. పాటలను, సినిమాను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘కృష్ణంరాజుగారి ‘రంగూన్ రౌడీ’లోని ‘ఓ జాబిలి...’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాం’’ అని కౌశిక్ తెలిపారు.