బాలీవుడ్‌ జంటకు విడాకులు మంజూరు

11 May, 2017 18:14 IST|Sakshi
బాలీవుడ్‌ జంటకు విడాకులు మంజూరు

ముంబై: బాలీవుడ్‌ జంట అర్బాజ్‌ ఖాన్‌, మలైకా అరోరాలు 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట గత నవంబర్‌ నెలలో తొలిసారిగా కోర్టు మెట్లెక్కింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక‍్తిగతంగా హాజరైన అర్బాజ్‌, మలైకాలకు పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరి విడాకుల పిటిషన్‌ పై ఫ్యామిలీ కోర్టు తుది తీర్పిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అర్బాజ్‌, మలైకాల వివాహం 1998లో జరిగింది. వీరికి 14 ఏళ్ల ఓ కొడుకు ఉన్నాడు. మనస్పర్థల కారణంగా గతేడాది తాము విడిపోవాలనుకుంటున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి వివాహ బంధం ముగిసినట్లు తీర్పిచ్చింది. బాబు సంరక్షణ బాధ్యతలను మలైకాకు అప్పగించగా.. ​బాబును కలిసి అతడితో సమయం వెచ్చించేందుకు అర్బాజ్‌ ను ఫ్యామిలీ కోర్టు అనుమతించింది.

విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన వీరిద్దరూ కలిసి ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అంతా సద్దుమణిగిందని పొరపడ్డారు. స్నేహితులతో కలిసి గోవాలో వీరు న్యూఇయర్‌ పార్టీని ఎంజాయ్‌ చేశారు. సల్మాన్‌ ఇంట్లో ప్రతి వేడుకకు మలైకా ఆరోరా రావడంతో విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావించారు. కానీ తమ కుమారుడి సంతోషం కోసమే ఈ సందిగ్ద కాలంలోనూ వారు కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో మలైకా చనువుగా ఉండటమూ వీరి బంధానికి ముగింపు పలికేలా చేసిందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.