కన్నీరుమున్నీరవుతూ మెగాస్టార్‌కు నటి క్షమాపణలు

26 Sep, 2017 20:16 IST|Sakshi

తిరువనంతపురం : మంచి సినిమాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన కేరళ నటి అన్నా రాజన్‌ ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయారు. ఓ టీవీ షోలో జోక్‌గా చేసిన కామెంట్లతో, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చివరికి వారి ఆగ్రహానికి దిగి వచ్చిన అన్నా రాజన్‌, కన్నీరుమున్నీరవుతూ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మెగాస్టార్‌ మమ్ముటీకి క్షమాపణలు చెప్పారు. అసలేం జరిగిందంటే.. దుల్కర్‌ సల్మాన్‌, మమ్మూటీలతో కలిసి నటించడానికి ఇష్టపడతారా? అని అన్నా రాజన్‌ను ఓ మలయాళం ఛానల్‌ తన టీవీ షోలో ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు తాను, దుల్కర్‌ను హీరోగా ఇష్టపడతానని, మమ్మూటీ తనకు ఆన్‌-స్క్రీన్‌ తండ్రి పాత్ర పోషిస్తారంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు మమ్మూటీ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్‌ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి, అన్నా రాజన్‌ క్షమాపణలు చెప్పారు.
 
''  దీన్ని నేను జోక్‌గా తీసుకున్నా. నా కామెంట్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది మీడియా వాళ్లు నా కామెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారనుకోలేదు. మమ్మూటీని, దుల్కర్‌ను నేను అవమానపరచలేదు. ఇంత గొప్ప నటుడును అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ నేను అన్న మాటలు ఏమన్నా బాధ కలిగించి ఉంటే, మమ్మూటీ, దుల్కర్‌ అభిమానులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. మమ్మూటీ, దుల్కర్‌ ఇద్దరు సినిమాల్లో నాకు నటించాలని ఉంది. మమ్మూటీతో జతకట్టడానికి కూడా నేను సిద్ధమే'' అని రాజన్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో చెప్పారు. అన్నా రాజన్‌ మలయాళంలో నటించిన రెండు మూవీలకు మంచి రివ్యూలు వచ్చాయి. తన తాజా సినిమా వెలిపాడింటె పుస్తకం. ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌కు భార్యగా నటించారు. 

మరిన్ని వార్తలు