దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు

26 Jan, 2019 20:36 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్‌ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మా నాన్న ఒక బడిపంతులు. విలన్‌గా ఉన్న నన్ను కమెడియన్‌గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా.. హీరోగా తయారు చేసింది మా గురువు గారే. అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను నిర్మించిన శ్రీ విద్యానికేతన్‌లో దాసరి పేరుతో ఆడిటోరియం, లైబ్రరీని నిర్మించాను’  అని మోహన్‌బాబు దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు.

కొమ్ములు తిరిగిన నటుడైనా సరే దాసరిని వేషం ఇమ్మని అడిగారే తప్ప ఆయన ఏనాడు ఏ నటుడిని ఫలానా వేషం వేయాలని అడగలేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు. కాగా దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు సహా సినీ ప్రముఖులు రాజా వన్నెంరెడ్డి, కోటి, రవిరాజా పినిశెట్టి,  ఎన్.శంకర్, సురేష్ కొండేటి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు