స్టార్‌ హీరోకు ‘పద్మ’ అవార్డుపై సెటైర్లు

27 Jan, 2019 20:39 IST|Sakshi

న్యూఢిల్లీ: మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించడంపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది ఆయనను అభినందిస్తుంటే, మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినందుకు ‘ఫలితం’ దక్కిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మోదీని మోహన్‌లాల్‌ కలిశారు. తాను నిర్వహిస్తున్న సేవా సంస్థ విశ్వశాంతి ఫౌండేషన్‌ కార్యక్రమాల కోసం ప్రధానమంత్రిని కలిసినట్టు అప్పట్లో ఆయన చెప్పారు. సానుకూలంగా తమ భేటీ జరిగిందన్నారు.

‘సానుకూల సమావేశం వృధాగా పోలేదు. పద్మభూషణ్‌ పురస్కారం తెచ్చిపెట్టింద’ని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలని చూస్తున్న గౌతమ్‌ గంభీర్‌, మోహన్‌లాల్‌ పద్మపురస్కారాలు దక్కించుకున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతున్న మోహన్‌లాల్‌ నటనకు స్వస్తిచెప్పి కేరళ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కాగా, తనకు దక్కిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని తనను అభిమానించే వారికి అంకితం చేస్తున్నట్టు మోహన్‌లాల్‌ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు