‘ఆ వెబ్‌సైట్ల’పై మా ఫిర్యాదు

4 Oct, 2017 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయివేట్‌ వెబ్‌సైట్లు, యూ ట్యూబ్‌ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు  అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్  చేసి  తమ  క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్‌సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్‌ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ రాంమోహన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు వందల వెబ్‌సైట్లఫై ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని తెలిపారు. సినీ సెలబ్రిటీలే కాకుండా, వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా కథనాలు రాసినా, ప్రచురించినట్లు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరిని అశ్లీలంగా చూపెట్టినా నిందితులు శిక్షార్హులని పేర్కొన్నారు. ఐటీ యాక్ట్ 66 ప్రకారం ఇటువంటి బూతు కథనాలు, అవాస్తవాలు రాయడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు అప్ లోడ్ చేసేవారితో పాటు ఆ వెబ్ సైట్ల నిర్వాహకులఫై కేసులు నమోదు చేసి చర్య తీసుకుంటామన్నామని చెప్పారు. విదేశాల్లో ఉండి వెబ్‌సైట్లను నిర్వహిస్తున్న వారిని సైతం విడిచిపెట్టేది లేదన్నారు.

మరిన్ని వార్తలు