మన్మథుడి బంధువులు పోర్చుగల్లో ఉన్నారు. వారిని కలవడానికి త్వరలో అక్కడికి వెళ్లబోతున్నారు నాగార్జున. ఈపాటికే అర్థమై ఉంటుంది.. ఇది ‘మన్మథుడు 2’ సినిమా గురించి అని. నాగార్జున హీరోగా ‘చి.ల.సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది.
నెక్ట్స్ షెడ్యూల్ కోసం టీమ్ పోర్చుగల్ ప్రయాణమవనున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ వచ్చే వారం ఆరంభం అవుతుందని సమాచారం. పోర్చుగల్లో సెటిల్ అయిన తన బంధువులను కలవడానికి హీరో వెళతాడట. అలాగే ఈ సినిమాలో నాగార్జునకు, ‘వెన్నెల’ కిశోర్కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా స్క్రిప్ట్, డైలాగ్స్ను రెడీ చేశారట రాహుల్ రవీంద్రన్. రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.