బాలీవుడ్‌ భారీ బడ్జెట్‌లో నాగ్‌!

10 Jul, 2018 08:13 IST|Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నాగార్జున అక్కినేని చాలా గ్యాప్‌ తర్వాత తిరిగి బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో బ్రహ్మస్త్ర చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నాగ్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ కోసం చాలా కాలంగా నాగ్‌ ఎదురు చూస్తున్నారు. బ్రహ్మస్త్ర దర్శకుడు అప్రోచ్‌ అవ్వటం, కథ నచ్చటం.. పైగా అమితాబ్‌ కూడా నటిస్తుండటంతో నాగ్‌ వెంటనే ఒప్పుకున్నాడని ఓ ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. అంతేకాదు ముంబైలో జరగబోయే షెడ్యూల్‌కు నాగ్‌ హాజరుకాబోతున్నట్లు ఆ కథనం పేర్కొంది. 

మరోవైపు నానితో చేస్తున్న మల్టీస్టారర్‌ దేవదాస్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. దేవదాస్‌ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, నాగ్‌ గతంలో ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్‌ తదితర చిత్రాల్లో నటించగా, 2003లో ఎల్‌వోసీ కార్గిల్‌ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగ్‌ తిరిగి హిందీ సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు