ప్రేక్షకాదరణే ప్రధానం

9 Aug, 2018 08:26 IST|Sakshi
సైమా అవార్డు అందుకుంటూ.. (ఫైల్‌)

‘శ్రీనివాస కళ్యాణం’ ఫేం నందిత శ్వేతా

కంటోన్మెంట్‌: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ రెండేళ్ల క్రితం నిఖిల్‌ను పలకరించిన నందిత శ్వేతా తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’లో నితిన్‌కు మరదలుగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తొలుత వీడియో జాకీగా కేరీర్‌ ప్రారంభించిన ఈ బెంగళూరు అమ్మాయి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటివరకు ఆమె 8 సినిమాల్లో నటించగా, అందులో ఆరు సినిమాలు ఈ ఏడాదిలోనే కావడం విశేషం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా రావడంతో తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగులో తన రెండో సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారం విడుదల కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నందిత శ్వేతా కొద్దిసేపు ముచ్చటించారు. ప్రేక్షకుల ‘సపోర్ట్‌’తో తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించేఅవకాశముందన్నారు.  

ఇటీవల ఆఫర్లు పెరిగాయి..
2008లో తొలి సినిమా విడుదలైన నాలుగేళ్లకు 2012లో తమిళ సినిమాలో నటించా. 2013లో విడుదలైన ఎథిర్‌ నీచల్‌ చిత్రానికి గానూ సైమా అవార్డు దక్కగా, తెలుగు చిత్రం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ అవార్డు వచ్చిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు విడుదలయ్యాయని, వీటిలో కుష్బూ నిర్మించిన ‘కాలకలప్పు–2’లో సీబీఐ ఆఫీసర్‌ పాత్ర పోషించినట్లు తెలిపారు. హిందీలో, తమిళంలో మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు