బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో నవాజుద్దీన్‌ సోదరి మృతి

9 Dec, 2019 09:57 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్దీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇక స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా(ఉత్తరప్రదేశ్‌)లో ఆదివారం నిర్వహించినట్లు సమాచారం. కాగా నవాజుద్దీన్‌ ఇటీవల ‘మోతీచూర్‌ చక్నాచూర్‌’ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సాక్రెడ్ గేమ్స్‌, యూకే సిరీస్‌ మెక్‌మాఫియా యూనిట్‌ తరఫున గత నెలలో జరిగిన ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. ప్రస్తుతం.. బంగ్లాదేశీ ఫిల్మ్‌మేకర్‌ సర్వార్‌ ఫరూఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో షూటింగ్‌ జరుగుతుండగానే చెల్లెలి మృతి విషయం తెలియడంతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు