అంతా నిశ్శబ్దం

7 Nov, 2019 01:11 IST|Sakshi
అనుష్క

టైటిల్‌కి తగ్గట్టుగానే ఉంది ‘నిశ్శబ్దం’ టీజర్‌ కూడా. ‘భాగమతి’ వంటి హిట్‌ చిత్రం తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో అనుష్క మాట్లాడలేని సాక్షి అనే అమ్మాయి పాత్రలో నటించారు. నేడు (నవంబర్‌ 7న) అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.  ఇందులో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ఏదో విషయాన్ని అనుష్క సైగలతో చెప్పడానికి ప్రయత్నించే సన్నివేశాలతో టీజర్‌ని విడుదల చేశారు. హేమంత్‌ మధుకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘నిశ్శబ్దం’ తెలుగు టీజర్‌ని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. తమిళ, మలయాళ టీజర్స్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్, హిందీ టీజర్‌ను డైరెక్టర్‌ నీరజ్‌ పాండే రిలీజ్‌ చేశారు. ‘‘తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, ప్రీ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్‌ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్‌ అవసరాల, మైకేల్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్‌ డియో, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

>
మరిన్ని వార్తలు