మొదటి సినిమా ఆడలేదంట.. 6 కోట్ల మంది పక్కన ఉన్నా...

16 Feb, 2019 19:26 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం కథానాయకుడు బాలకృష్ణను తీవ్రంగా నిరాశపరచడంతో పాటు.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ ను విడుదల చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్‌.

ఎన్టీఆర్‌ రాజకీయం అరంగేట్రంతో మొదలైన ఈ ట్రైలర్‌.. ఇందిరా గాంధీ, నాదెండ్ల భాస్కర్‌రావు, చంద్రబాబు నాయుడు తదితరుల పాత్రలతో నిండుగా ఉంది. ‘ఇచ్చిన ప్రతీ మాటపై నిలబడాలి... ఆన్‌డోర్‌ ఆన్‌టైమ్‌.... రాజకీయాల కోసం కాదు.. మీ ఇంటి పసుపులా ఉండటానికి వచ్చా’  అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుండగా... ‘చెప్పెటోడు ఉండాలి లేకుంటే ఆరు కోట్ల మంది ఆయన పక్కన ఉన్నా లాభం లేదంటూ’ రానా చెప్పే డైలాగులు సినిమా ఎలా ఉండబోతుందోనన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్య కారణాల రీత్యా ఎన్టీఆర్‌ విదేశాలకు వెళ్లడం... ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు అధికారం చేజిక్కుంచుకోవడం వంటి సీన్లు చూస్తుంటే సినిమా మొత్తం నాదెండ్లను టార్గెట్‌ చేసినట్లుగానే అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన ‘ఆగస్టు సంక్షోభం’ చుట్టూనే సినిమా మొత్తం కేంద్రీకృతమైనట్లుగా ఈ ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది

కాగా ఎన్టీఆర్‌ తిరిగి అధికారం చేపట్టడమే ప్రధానంగా ‘మహానాయకుడు’ సాగితే... వెన్నుపోటే ప్రధాన అంశంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించడంతో ఈ రెండు సినిమాలు ఎన్నికల వేళ పొలిటికల్‌ హీట్‌ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు