మల్టీస్టారర్స్‌తో భారీ చిత్రం

9 Dec, 2017 17:20 IST|Sakshi

రాజా ది గ్రేట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి

సాక్షి, గుంటూరు : మల్టీస్టారర్‌ భారీ చిత్రానికి రూపకల్నన చేస్తున్నట్టు ప్రముఖ సినీ దర్శకులు అనిల్‌ రావిపూడి చెప్పారు. గణపవరం శ్రీ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చిన్నతనం నుంచి కళలంటే ఎంతో అభిమానమని, సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, 2015లో తన బాబాయి అరుణ్ ప్రసాద్‌ ప్రోద్బలంతో సినీరంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు. 2015కు ముందు కంత్రీ, శౌర్యం, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, కందిరీగ, మరికొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. 2015లో పటాస్‌ సినిమాకు దర్శకత్వం వహించానన్నారు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్‌ సినిమాలకు దర్శకత్వం వహించానని పేర్కొన్నారు.

త్వరలో దగ్గుబాటి వెంకటేశ్‌తో మల్టీస్టారర్‌ సినిమాకు రూపకల్పన చేశానని, సినిమాల్లో నాణ్యత, కొత్తదనం చూపే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. తన స్వగ్రామం యద్దనపూడి మండలం, చిలుకూరివారిపాలెం అని గుంటూరు విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసి 2005లో సినీరంగంలో అడుగు పెట్టానన్నారు. సినీరంగంలో దిల్‌రాజాతో పాటూ మరికొంతమంది తనకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అవకాశం వస్తే పెద్ద హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి టర్నింగ్‌ పాయింట్‌ సాధిస్తానన్నారు.

మరిన్ని వార్తలు