సెలైంట్‌గా ఉంటూనే కడుపుబ్బా నవ్విస్తా అంటున్న శ్రీ

9 Aug, 2013 01:13 IST|Sakshi
సెలైంట్‌గా ఉంటూనే కడుపుబ్బా నవ్విస్తా అంటున్న శ్రీ
‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ కథానాయకునిగా రూపొందించిన చిత్రం ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’. సుప్రజ కథానాయిక. సాజిద్ ఖురేషి దర్శకుడు. సోహైల్ అన్సారీ నిర్మాత. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం హైదరాబాద్‌లో శ్రీ మాట్లాడుతూ -‘‘తమిళంలో హిట్టయిన ‘నడువుల కొంజెం పక్కత్తినె కానుం’ చిత్రం సీడీ ఇచ్చి నన్ను చూడమన్నారు దర్శకుడు ఖురేషి. నాకు తమిళం రాదు.
 
 అందుకే నా కుటుంబ సభ్యుల్ని చూడమన్నాను. వారందరీకీ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఈ  సినిమాకి ఓకే చెప్పా. ఈ పాత్ర పోషిస్తున్నప్పుడే అందులోంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేది. ఇందులో నేను మెమరీలాస్ పేషెంట్‌ని. సెలైంట్‌గా ఉంటూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తా. నటునిగా నా సామర్థ్యాన్ని పెంచే పాత్ర ఇది. ఈ తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చారు దర్శకుడు ఖురేషీ. రీమేక్ ఇలాక్కూడా చేయొచ్చా అనిపించేలా ఉంటుందీ సినిమా. తప్పకుండా అందరినీ నచ్చుతుందని నా నమ్మకం’’ అన్నారు.
 
 ‘‘యువతరం మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. దర్శకుడు కావాలనే నా కలను నిజం చేసిందీ సినిమా. శ్రీ ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశాడు. తెలుగమ్మాయి సుప్రజ ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. 200 థియేటర్లలో రంజాన్ పండుగ సందర్భంగా నా సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు చెప్పారు.