చెన్నై వెర్సస్ ముంబయ్!

19 Mar, 2016 23:38 IST|Sakshi
చెన్నై వెర్సస్ ముంబయ్!

జోరుగా రజనీ-అక్షయ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, నార్త్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే... చూడ్డానికి పసందుగా ఉంటుంది. అసలు వీళ్లెందుకు మ్యాచ్ ఆడాలి అనుకుంటున్నారా? సినిమా కోసమే ఆడనున్నారు. రజనీకాంత్ హీరోగా ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో ‘2.0’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ ఇద్దరూ పాల్గొనగా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియమ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సీన్లు తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియమ్ చుట్టూ పెద్ద పెద్ద బెలూన్లు, ‘ఐఎఫ్‌ఎల్’ లోగో, ‘చెన్నై వెర్సస్ ముంబయ్’ ఇలా రియల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని తలపించే సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు జూనియర్ ఆర్టిస్టులతో శంకర్ రిహార్సల్స్ చేయిస్తున్నారు. సోమవారం నుంచి రజనీకాంత్, అక్షయ్‌కుమార్ మ్యాచ్ ఆడనున్నారు.

సినిమాకి కీలకంగా నిలిచే ఈ సన్నివేశాల చిత్రీకరణకు దాదాపు 40 రోజులు పడుతుందని సమాచారం. కాగా, జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియమ్‌లో రజనీ, అక్షయ్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని, భారీ ఎత్తున జనాలు గుమిగూడిపోయారు. ప్రస్తుతానికి రజనీ, అక్షయ్ లేరని తెలిసి నిరుత్సాహపడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపిస్తారని సమాచారం. వాస్తవానికి ఇందులో అక్షయ్ చేస్తున్న విలన్ పాత్రకు ముందుగా అమితాబ్‌ను అడిగారు దర్శకుడు శంకర్. ఆ పాత్ర గురించి రజనీని అమితాబ్ సంప్రతిస్తే, విలన్‌గా మిమ్మల్ని అంగీకరించరని, చేయొద్దనీ అన్నారట. ఎలాగైనా బిగ్ బీని ఈ సినిమాలో నటింపజేయాలనుకొని, ఆయనతో పాటు ఆయన తనయుడి కోసం రెండు ప్రత్యేక సన్నివేశాలను శంకర్ క్రియేట్ చేసి ఉంటారని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.