ఆ తర్వాత ఇదే గొప్ప విజువల్: రామ్ గోపాల్ వర్మ

19 Oct, 2015 17:41 IST|Sakshi
ఆ తర్వాత ఇదే గొప్ప విజువల్: రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య మెగా ఫ్యామిలీ మీద పడ్డట్టు కనిపిస్తోంది. రీసెంట్గా రిలీజైన రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా మీద తనదైన శైలిలో సెటైర్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన రామూ తాజాగా మరోసారి ట్విట్టర్లో మెగా ఫ్యామిలీపై కామెంట్లు చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కలిసున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసి.. నయాగరా జలపాతం తర్వాత ఇదే గొప్ప విజువల్ అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఊరుకోకుండా పట్టలేనంత సంతోషంగా ఉందని.. మళ్లీ వెళ్లి 'బ్రూస్ లీ' సినిమా చూస్తానని పేర్కొన్నారు.

ఆదివారం సాయంత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ నుంచి నేరుగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి 'బ్రూస్ లీ' లో నటించిన చిరంజీవిని అభినందించిన విషయం తెలిసిందే. అయితే 'చిరంజీవి, పవన్ కళ్యాణ్లు కలవడం కల అనుకున్నానని.. తీరా లేచి చూశాక అది నిజమని రియలైజ్ అయ్యానని.. మెగా ఫ్యామిలీ విషయంలో ఇప్పుడు తనకెంతో సంతోషంగా ఉందని' కామెంట్ చేశారు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.